అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 10 వేల కరోనా కేసుల నమోదవడం ఈ తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 54 వేలకు పెరిగింది. మరోవైపు మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కు చేరింది. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలోనే మంగళవారం 53 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ మృతిచెందిన వారి సంఖ్య 201కి చేరింది. బాధితుల సంఖ్య 25వేలకు పెరిగింది. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్, ఇల్లినాయిన్, ఫ్లోరిడాలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. కాగా వైరస్ తొలుత విజృంభించిన వాషింగ్టన్ లో మంగళవారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.