ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 24న “జగనన్న వసతి దీవెన” ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 07:23 PM

జగనన్న వసతి దీవెన పథకాన్ని ఫిబ్రవరి 24న విజయనగరం జిల్లాలో సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అదే విధంగా దిశ పోలీస్ స్టేషన్ ను కూడా ప్రారంభిస్తారన్నారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం పరిశీలించారు. అధికారులకు,పోలీసులకు సలహాలు సూచనలు చేశారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా నుంచి ప్రారంభించడం అదృష్టమని మంత్రి బొత్స అన్నారు.
జగనన్న వసతి దీవెన పథకం ద్వారా వీటిని అందజేయనున్నారు.
- హాస్టల్, మెస్ ఖర్చులకు ఐటీఐ విద్యార్థులకు(ఒక్కొక్కరికి) రూ.10,000.
- పాలిటెక్నిక్ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.15,000.
- డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.20,000.
- ఈ మొత్తాన్ని ఏడాదిలో రెండు దఫాలు (జూలై, డిసెంబర్‌లో)గా అందజేస్తారు.
అర్హతలు,అనర్హతలు,ఆదాయ పరిమితి,అప్లికేషన్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
- విద్యార్థులు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతుండాలి.
- డే స్కాలర్ విద్యార్థులు, కాలేజీ అటాచ్డ్ హాస్టల్స్ (సీఏహెచ్), డిపార్ట్‌మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ (డీఏహెచ్) విద్యార్థులు 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
- కుటుంబ సభ్యులకు కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండ కూడదు.
- ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద ట్యాక్సీలు, ట్రాక్టర్‌లు, ఆటోలు తీసుకున్న కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో (రెసిడెన్షియల్ లేదా కమర్షియల్) 1,500 చదరపు అడుగులలోపు సొంత స్థలం కలిగి ఉన్న వారు కూడా అర్హులే.
- దూర విద్య, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుతున్న వారు, మేనేజ్‌మెంట్ కోటా కింద చేరిన వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉన్న వారు అనర్హులు.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి.
- కుటుంబానికి 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. లేదా.. మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి.
- వార్షికాదాయంతో సంబంధం లేకుండా శానిటరీ వర్కర్స్ పిల్లలు అర్హులు.
- ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హత గల విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆయా విభాగాలకు అప్‌లోడ్ చేస్తాయి.
- ఆదాయ పరిమితి పెంచినందున తహశీల్దార్ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త విద్యార్థులకు అర్హత కల్పిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com