ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని సీఎం జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 25 జిల్లాలను ఏర్పాటు చేసి జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు. అయితే రాజధానుల అంశం హాట్ హాట్గా ఉన్న సమయంలో కరెక్టు కాదని జిల్లాల ఏర్పాటుపై జగన్ వెనక్కి తగ్గారు. అయితే కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఇటీవలే కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ కూడ ఇచ్చారు. ఈ మూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను చూసిన తర్వాత జిల్లాల పెంపుపై సీఎం జగన్ తన స్ట్రాటజీని మార్చుకున్నట్లు సమాచారం. జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మిస్తానమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వైద్యుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టత ఇచ్చారు. దీంతో 25 జిల్లాల కంటే అధికంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారట. అలా చేస్తే మెడికల్ కాలేజీలతో పాటు ఏపీ విద్యార్ధులకు ఎక్కువగా మెడికల్ సీట్లు దక్కుతాయని సీఎం జగన్ ఆలోచిస్తున్నారట.
జిల్లాకు 50 సీట్లు కేటాయించినా కూడ ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని సీట్లు పెరుగుతాయన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెడిసిన్ విద్య కోసం ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండదని జగన్ ఆలోచనగా సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాతిపదికన ఏపీలోని 13 జిల్లాలను ఇంకా ఎక్కువ జిల్లాలను చేయడానికి సీఎం జగన్ సిద్దమైనట్లు సమాచారం.