మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు నీళ్లపప్పు, అన్నం అందించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ చిత్రకోట్లోని ఒక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్న ఫోటోలను ఈ సందర్భంగా ట్విట్టర్లో షేర్ చేశారు. అనంతరం యోగి సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ పాఠశాలలు, వార్డుల పట్ల బిజెపి ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని దుయ్యబట్టారు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని చిన్నారులకు అందివ్వడమే మధ్యాహ్న భోజనం ప్రధాన లక్ష్యం. కానీ యుపిలో కొన్నిసార్లు విద్యార్థులకు ఉప్పు, రోటీ, మరి కొన్ని సార్లు నీళ్ల పప్పు, నీళ్ల పాలు అందిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. గత నెలలో రాష్ట్రంలోని సోన్భద్ర జిల్లాలోని స్థానిక పాఠశాల్లో లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందించిన సంగతి తెలిసిందే.