దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లిని కొనుగోలు చేయలేని పరిస్థితిలో సామాన్యులు ఉన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉల్లి కొరతపై, అలాగే విపరీతంగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైన విధానంపై లొల్లి కొనసాగింది. ఇది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి హెరిటేజ్ పై దుమారం రేపింది.
ఉల్లి కొరత మరియు ధరలపై అసెంబ్లీలో టీడీపీ ఆందోళన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వాటి ధరలను ప్రస్తావిస్తూ హెరిటేజ్లో కిలో ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో హెరిటేజ్ పై దుమారం రేగింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గిట్టుబాటు ధర లేక ఉల్లిని రైతులు పొలాల్లోనే వదిలేశారు అనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయని అయినప్పటికీ దేశంలో కిలో ఉల్లిని కేవలం రూ. 25కే అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి జగన్ ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను తెలిపారు.
హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదన్న చంద్రబాబు
ఇక దానికి సమాధానం గా చంద్రబాబు హెరిటేజ్ మాదికాదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదని హెరిటేజ్ ఫుడ్స్ తమదని అదికూడా తెలియకుండా విమర్శలు ఏంటని ప్రశ్నించారు. సభలో ఉన్న వారందరికీ హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని తెలిసి కూడా ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం ఏంటని ప్రశ్నించారు.ఇక హెరిటేజ్ పై అసెంబ్లీ వేదికగా రచ్చ నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు నారా భువనేశ్వరి.
ఉల్లి ధరలు గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదన్న భువనేశ్వరి
హెరిటేజ్ పై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఉల్లిధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ఉల్లి ధరలు ఇంత భారీగా పెరగడం ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని భువనేశ్వరి కోరారు. ఇదే సమయంలో హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలతో మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు భువనేశ్వరి.
హెరిటేజ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన భువనేశ్వరి
హెరిటేజ్ ఫ్యూచర్ గ్రూప్స్ వాళ్లదని ఆమె పేర్కొన్నారు.హెరిటేజ్ ఫ్రెష్ తమ అధీనంలో లేదని,హెరిటేజ్ ఫ్రెష్ కు తమకు ఎలాంటి సంబంధమూ లేదని భువనేశ్వరి పేర్కొన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు, జగన్ ల మధ్య చోటు చేసుకున్న ఉల్లి లొల్లిలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు నిర్వహించే సంస్థ కూడా టార్గెట్ అయ్యింది. అందుకే భువనేశ్వరి స్పందించి దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు.