నూతన ఉత్తేజంతో 2020లోకి అడుగుపెట్టే ముందు ఈ ఏడాది భారత మహిళా క్రీడాకారిణులు సాధించిన విజయాలను నెమరేసుకుంటే.. తెలుగుతేజం, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు 'ది బెస్ట్'గా నిలిచింది. 2019 ముగుస్తున్న సందర్భంగా 'ట్విట్టర్ ఇండియా' భారత మహిళల టాప్ స్పోర్ట్స్ హ్యాండిల్స్ను ప్రకటించింది. ఈ జాబితాను పేరు, హ్యాండిల్, సంబంధిత కీవర్డ్స్ ఆధారంగా లెక్కించారు. 2019 జనవరి 1 నుండి నవంబర్ 15 వరకు హ్యాండిల్స్ను లెక్కలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో పీవీ సింధు అగ్రస్థానంలో నిలిచింది. సింధు తర్వాత హిమదాస్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, స్మృతి మందాన, ద్యుతి చంద్, మాన్సీ జోషి, రాణి రాంపాల్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. స్విట్జర్లాండ్ వేదికగా గత ఆగస్టు నెలలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో పీవీ సింధు జపాన్ షట్లర్ ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్గా సింధు అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. సింధు ఆటతీరు ఇంత అద్భుతంగా మారడానికి కారణం మాత్రం ఆమె కొత్త కోచ్ కిమ్ జి హ్యున్. ఈ టోర్నీ గెలిచిన సమయంలో సోషల్ మీడియాలో సింధు పేరు ట్రెండ్ అయింది. పరుగుల తార హిమదాస్ ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉంది. నెల వ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ ప్రదర్శనతో ప్రపంచ అథెటిక్స్ ఛాంపియన్షిప్లో హిమదాస్ చోటు దక్కించుకుంది. ఆటతో కాకుండా ఇతర విషయాలతో టెన్నిస్ భామ సానియా మీర్జా మూడో స్థానంలో నిలిచింది. కుమారుడికి జన్మనివ్వడం, ప్రపంచకప్లో పాక్ ఓటమి, ఫిట్నెస్, చెల్లెలి పెళ్లి వంటి వార్తలతో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. పెళ్లి, వరుస ఓటములతో సైనా నెహ్వాల్ కూడా ట్రెండ్ అయింది. రిటైర్మెంట్, కోచ్ వివాదాలతో మిథాలీ రాజ్.. రికార్డు స్థాయిలో స్వర్ణాలు సాధించి మేరీ కోమ్.. అద్భుత బ్యాటింగ్తో స్మృతి మందాన.. సహజీవనంతో ద్యుతి చంద్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి మాన్సీ జోషి.. అద్భుత ఆట, కెప్టెన్సీతో రాణి రాంపాల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో హవా కొనసాగించారు.