దేశంలోని క్రీడలను స్వచ్ఛంగా ఉంచేందుకు 58 ఏళ్ల సునీల్ శెట్టి ఇమేజ్ బాగా ఉపయోగపడుతుందని నాడా భావిస్తోంది. ఈ ఏడాది 150 మందికి పైగా అథ్లెట్లు డోపింగ్లో దొరికిపోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డోపింగ్కు పాల్పడిన వారిలో బాడీ బిల్డర్లు 1/3 వంతు ఉండడం విశేషం. 'అథ్లెట్, మాజీ అథ్లెట్ల కన్నా ఓ సినిమా హీరో దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ ప్రభావం చూపగలడు. దేశంలోని ఎక్కువ మంది సెలబ్రిటీలను అనుసరిస్తారని మేము భావించాం. అందుకే క్రీడల్లో డోపింగ్ను దూరం చేసే చర్యల్లో భాగంగా సునీల్ శెట్టిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశాం. అంతేకాకుండా తాజా అథ్లెట్లు వివిధ టోర్నీల్లో బిజీగా ఉండడంతో.. ప్రచారానికి తగిన సమయం కేటాయించలేరు' అని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ సోమవారం తెలిపారు. టోక్యో ఒలింపిక్స్కు ఎక్కువ సమయం లేకపోవడంతో క్రీడాకారులను స్వచ్ఛంగా ఉంచేందుకు సునీల్ శెట్టి ఇమేజ్ను నాడా ఉపయోగించుకోనుంది. నాడా ఎంపిక సరైనదే అనిపిస్తుంది. ఎందుకంటే సునీల్ ఫిట్నెస్ ఔత్సాహికుడిగా కూడా పేరుపొందాడు. రెండు నెలల క్రితం మాల్దీవుల ప్రభుత్వం అతన్ని వెల్నెస్ అంబాసిడర్గా నియమించింది. మీడియా నివేదికల ప్రకారం.. మాదకద్రవ్యాల పరీక్షలో విఫలమైన, నిషేధించబడిన, సస్పెండ్ చేయబడిన భారత అథ్లెట్ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2019లో రెట్టింపు అయ్యింది. తాజాగా భారత ప్రముఖ బాస్కెట్బాల్ ప్లేయర్ సత్నామ్ సింగ్ భమారా డోపింగ్లో పట్టుబడ్డాడు. దీంతో నాడా సత్నామ్పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. దక్షిణాసియా క్రీడలకు సన్నాహక శిబిరం సందర్భంగా బెంగళూరులో సత్నామ్ శాంపిల్స్ను నాడా సేకరించింది. వీటిలో 'ఎ' శాంపిల్ను పరీక్షించగా.. సత్నామ్ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లుగా పరీక్షలో వెల్లడైంది. దీంతో నవంబర్ 19 నుంచి భమారాపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు నాడా ప్రకటించింది. భారత్ నుంచి నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు ఎంపికైన తొలి బాస్కెట్బాల్ ప్లేయర్గా సత్నామ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.