ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సఫారీని ఎంజాయ్ చేసిన అండర్‌-19 క్రికెటర్లు!

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 01:17 PM

 భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైనప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య టీమ్‌ బాండింగ్‌ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. టీమ్‌ బాండింగ్‌ ప్రోగ్రామ్‌తో పాటు టైగర్‌ సఫారీలకు వీరిని తీసుకెళ్లేవారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్టుని ఇటీవలే ఎంపిక చేశారు. వారందరూ కర్ణాటకలోని నాగర్‌హోల్‌ జాతీయ ఉద్యానవనంలోని కబిని ఫారెస్ట్‌ సఫారీలో రెండు రోజులు గడపనున్నారు. ఇందులో భాగంగా సోమవారం కబీని ఫారెస్ట్‌ సఫారీకి కూడా వెళ్లారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని బీసీసీఐ జీఎం సబా కరీమ్‌, ఎన్‌సీఏ సీవోవో తుఫాన్‌ ఘోష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌సీఏ సీవోవో తుఫాన్‌ ఘోష్‌ మాట్లాడారు. "ఇది రెండు రోజుల టీమ్‌ బాండింగ్‌ కార్యక్రమం. ఇటీవలే భారత్‌-ఏ జట్టు సైతం నాగర్‌హోల్‌ ఉద్యానవనానికి వచ్చింది. అండర్‌-19, భారత్-ఏ జట్లకు క్రమం తప్పకుండా వీటిని నిర్వహిస్తుంటాం. సీనియర్‌ జట్టుకైతే సొంత షెడ్యూల్ ఉంటుంది. అండర్‌-19 ఆటగాళ్లు దేశంలోని నలుమూలల నుంచి వస్తారు" అని ఆయన తెలిపారు. "ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య స్నేహం, నమ్మకం, బంధం, కలివిడితనం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. భిన్నమైన పరిస్థితులకు ఆటగాళ్లు ఎలా స్పందిస్తారో తెలుస్తుంది. ఈ రోజు టైగర్‌ సఫారీని వారు బాగా ఆస్వాదించారు" అని ఘోష్‌ తెలిపారు. వచ్చే జనవరిలో జరిగే అండర్-19 వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com