దిశ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా మహిళలపై అఘాయిత్యాలకు మాత్రం తెరపడటం లేదు. త్రిపురలో 17 ఏళ్ల మైనర్ బాలికపై నెలన్నర పాటు అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడు.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతి చెందింది. బాధితురాలి తండ్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవై జిల్లాలోని కల్యాణ్పూర్కి చెందిన యువతికి,దక్షిణ త్రిపురలో ఉన్న సంతిర్ బజార్ ప్రాంతంలోని ఓ రుద్రపాల్కి కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. రుద్రపాల్ బంధువుల్లో ఒకరు యువతి బంధువుని పెళ్లి చేసుకోవడంతో.. ఆ బంధుత్వం వీరి పరిచయానికి దారితీసింది. ఇదే క్రమంలో రుద్రపాల్ అక్టోబర్ 28న యువతిని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు రుద్రపాల్ను డిమాండ్ చేయడంతో రూ.5లక్షలు కట్నం అడిగాడు.దీంతో డిసెంబర్ 11న కట్నం కింద కొంత నగదును ముట్టజెప్పారు. అయితే కట్నం విషయంలో తల్లితో గొడవ కావడంతో.. యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. యువతి మృతి వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు రుద్రపాల్,అతని తల్లిపై దాడి చేశాడు. వారిద్దరిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.కేసులో నిందితులైన అజయ్ రుద్ర పాల్(25),అతని తల్లి అనిమా రుద్ర పాల్(59)లను పోలీసులు అరెస్ట్ చేశారు.