తులగు దేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో వైసీపీ నారీమణులు తమ ఇష్టానుసారం మాట్లాడారని, మహిళలపై వాళ్లకే ప్రేమ ఉన్నట్టు, ఎవరికీ లేనట్టుగా మాట్లాడారని విమర్శించారు.వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ ఓ రేప్ కేసులో నిందితుడని, రెండు నెలలు జైల్లో ఉండొచ్చాడని, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వరకట్న వేధింపుల కేసులో నిందితుడని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారిణి ఇంటికి వెళ్లి బెదిరించారని.. అటువంటి వ్యక్తులున్న పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒంగోలులో మైనార్టీ బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారానికి పాల్పడితే బాధితురాలిని హోం మంత్రి పరామర్శించలేకపోయారని, నిందితుడిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ నిప్పులు చెరిగారు.