టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మాల్దీవుల జట్టు 11.3 ఓవర్లు ఆడి ఎనిమిది పరుగులు చేసింది. అందులో ఏడు ఎక్స్ట్రాల ద్వారానే రావడం విశేషం. ఓపెనర్ ఐమా ఐషత్ మాత్రమే ఒక్క పరుగు చేయగలిగింది. మాల్దీవుల కెప్టెన్ జూనా మరియమ్ 16 బంతులు ఆడినా.. ఖాతా తెరువలేకపోయింది. నేపాల్ బౌలర్లలో అంజలి చంద్ ఓ పరుగిచ్చి నాలుగు వికెట్లు తీసింది. మాల్దీవుల మహిళా క్రికెట్ జట్టు మరోసారి చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. 13వ దక్షిణాసియా క్రీడల్లో భాగంగా నేపాల్తో శనివారం జరిగిన మ్యాచ్లో మాల్దీవులు కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. గత జూన్ నెలలో రువాండాపై ఆరు పరుగులు మాత్రమే చేసిన మాలి అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అనంతరం నేపాల్ కేవలం ఏడు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఓపెనర్లు కాజల్ శ్రేష్ట, రోమా థాపాలు విజయాన్ని అందించారు. మహిళల టీ20 క్రికెట్లో మాలి జట్టు అత్యంత స్వల్ప స్కోరుతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. క్విబుకా మహిళల టోర్నీలో రువాండాతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మాలి జట్టు 9 ఓవర్లలో 6 పరుగులకే కుప్పకూలింది.మాలి ఓపెనర్ మరిమ సమకే ఒక్క పరుగు చేయగా.. మిగిలినవి ఎక్స్ట్రాల ద్వారా వచ్చాయి. సింగిల్ డిజిట్ లక్ష్యాన్ని రువాండా నాలుగు బంతుల్లోనే ఛేదించింది. యూఏఈతో మ్యాచ్లో చైనా చేసిన 14 పరుగులే మహిళల టీ20లో ఇప్పటి వరకు అత్యల్ప స్కోరు. మాలి ఆ రికార్డును బద్దలుకొట్టింది.