ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు శుక్రవారం రాత్రి 11:40 గంటలకు తుదిశ్వాస విడిచింది. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసువిచారణ చేపడుతామని యోగి తెలిపారు. ఈ కేసు నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం యోగి స్పష్టం చేశారు. అత్యాచార బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతికి కారణమైన ఐదుగురు నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. బాధితురాలి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదు. వీలైనంత త్వరగా నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.