తొలి టీ20 మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్లు ఒక పక్క ముమ్మరంగా సాధన చేస్తుండగా.. మరో పక్క మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే రోజున ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ద్వారా సమాచారం తెలుస్తోంది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు దాదాపు లేవట. ఉదయం వర్షం పడినా.. మ్యాచ్ సమయానికి మైదానం సిద్ధంగా ఉంటుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులు తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మంగళవామే ఇరు జట్లు హైదరాబాద్ నగరానికి చేరకున్నాయి. ఉప్పల్లో 2017 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షంతో రద్దుకావడం గమనార్హం. అంతకు ముందునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాస్ వేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. దీంతో ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగలేదు. ఉప్పల్ స్టేడియం ఇప్పటి వరకు 6 వన్డేలు, 5 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. కోహ్లీసేన బుధవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసింది. ఉదయం వెస్టిండీస్ క్రికెటర్లు సాధన చేయగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. వామప్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి సాధన చేశారు. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ నేృత్వతంలో చాహల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, కుల్దీప్, భువనేశ్వర్, శ్రేయాస్ అయ్యర్ క్యాచ్లు పట్టడం.. త్రోలు విసరడం ప్రాక్టీస్ చేశారు.