ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రెండు రాజధానులు ఉండాలని.. బీజేపీ ఎంపీ కొత్త ప్రతిపాదన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2019, 12:27 PM

రాయలసీమలోని రాజధానిని కర్నూలుకు మార్చాలని కొందరు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాయలసీమలో రాజధాని అనే డిమాండ్‌పై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాలన్న టీజీ వెంకటేశ్... రాయలసీమలో శీతాకాల లేదా వేసవి రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ తరహాలో కాలానికి అనుగుణంగా ఏపీలో రెండు రాజధానులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు.


రాయలసీమ ప్రజలు ఎన్నో ఏళ్లుగా వీటిపై పోరాటం చేస్తున్నారని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోకుంటే యువత ఉద్వేగాలకు లోనై ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు టీజీ వెంకటేశ్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని ఆయన వివరించారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ కర్నూలులో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని టీజీ విమర్శించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేస్తానంటోందని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com