ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూజిలాండ్ కి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు !

international |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2019, 06:06 PM

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ అనంతరం సెడాన్ పార్క్‌లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని మార్లిబోన్ క్రికెట్ క్లబ్-బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ సంయుక్తంగా న్యూజిలాండ్ జట్టుకు అందజేసింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు లభించింది. ఈ ఏడాది జూలైలో లార్డ్స్‌లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో వివాదాస్పద పరిస్థితులలో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడు కుమార సంగక్కర మాట్లాడుతూ "న్యూజిలాండ్ జట్టు అవార్డును గెలుచుకున్నది. అద్భుతమైన ఫైనల్లో వాస్తవానికి టోర్నమెంట్‌లో తగిన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్రికెట్ ఆడినంత కాలం ఎక్కువ కాలం జ్ఞాపకార్థంగా నిలిచే మ్యాచ్ అది. ఇప్పటికీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. వారి చర్యలు ఈ గుర్తింపుకు అర్హమైనవి" అని అన్నాడు. పైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్‌ విసిరిన త్రో అనూహ్యంగా బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్‌ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి. ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com