తాజాగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ కొన్నేళ్లుగా బాగా రాణిస్తున్నారు. వారికి ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ జత కలిశారు. దీంతో టీమిండియా బౌలింగ్ పటిష్టంగా మారింది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కలుపుకొంటే బౌలింగ్ అటాక్ మరింత బాగుంటుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆసీస్ గడ్డపై ఇబ్బంది పడతారు' అని అన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా రాణించగలరు. టీమిండియా కన్నా ఆసీస్ జట్టు బౌలింగే అత్యుత్తమం అని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్తో పాటు.. పేసర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లయన్లు కీలక పాత్ర పోషించారు. 'భారత స్పిన్నర్ల కన్నా ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. అలాగే స్టార్క్ బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది. అతని బౌలింగ్ నాకెంతో ఇష్టం. ఆసీస్ బౌలర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా రాణించగలరు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. టీమిండియా కన్నా ఆసీస్ జట్టు బౌలింగే అత్యుత్తమం' అని పాంటింగ్ పేర్కొన్నాడు. టెస్టు ఛాంపియన్షిప్లో 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీనికి కారణం మాత్రం బౌలర్లే. వెస్టిండిస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లపై వరుస సిరీస్లు గెలిచి మంచి ఊపుమీదుంది. మరోవైపు పాకిస్థాన్పై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొందిన ఆసీస్ 176 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు మాట్లాడుతూ... 'టెస్ట్ సిరీస్లో పాక్ ప్రదర్శన దారుణంగా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం టెస్టు క్రికెట్కు అస్సలు సరిపోదు. దీర్ఘకాలంగా ఆసీస్ గడ్డపై దారుణ బౌలింగ్ను చూసినట్లు నాకు గుర్తులేదు. ప్రాక్టీస్, తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేసిన నసీమ్ షాను ఈ మ్యాచ్కు ఎందుకు తీసుకోలేదో ఇప్పటికీ అర్థం కాలేదు' అని పాంటింగ్ అసహనం వ్యక్తం చేసాడు.