ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాం. కానీ.. మేం ఊహించినట్టు జరగలేదు. ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. ఈ ఓటమితో చాలా నేర్చుకోవాలి అని పాకిస్తాన్ కెప్టెన్ అజర్ అలీ పేర్కొన్నాడు. పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ, లబుషేన్ సెంచరీలతో చెలరేగగా.. బౌలింగ్లో పేసర్ స్టార్క్ (6) స్పిన్నర్ నాథన్ లయన్ (5) అద్భుతంగా రాణించి విజయాన్ని అందించారు. పాక్ బ్యాట్స్మన్లలో షాన్ మసూద్ (68), అసద్ షఫీక్ (57), యాసిర్ షా (113), బాబర్ ఆజామ్ (97)లు రాణించినా జట్టును ఆదుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ అజర్ అలీ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా జట్టును అభినందించాలనుకుంటున్నా, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ను. వార్నర్ అద్భుతంగా ఆడాడు. మేము టాప్ జట్టు చేతిలో ఓడిపోయాం. అయితే అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమయ్యాం' అని తెలిపాడు. 'టెస్టు మ్యాచ్లు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. ఆసీస్లో 20 వికెట్లు తీయాలంటే ఎంతో సాధన అవసరం. ఆటలో పైచేయి సాధించడం చాలా ముఖ్యం. రెండు టెస్టుల్లో అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. అయితే మేం సానుకూలాంశాలను పరిగణలోకి తీసుకుంటాం. బాబర్ ఈ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఎటువంటి సందేహం లేదు, అతను భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టులో టాప్ ఆటగాడు అవుతాడు. యాసిర్ షా అద్భుతమైన పోరాటం చేశాడు' అని అలీ పేర్కొన్నాడు.'ఇక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడి, సరైన భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉండే. పేస్, బౌన్స్కు అలవాటు పడితే ఇక్కడ పరుగులు చేయొచ్చు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోతే.. ఆసీస్ బ్యాట్స్మన్ త్వరగా పరుగులు చేయగలరు. వారిని నియంత్రించాలంటే మంచి ఫీల్డింగ్ కూడా ఉండాలి. ఎన్నో ఆశలతో ఈ పర్యటనకు వచ్చినా.. మేం ఊహించినట్టు జరగలేదు. ఈ ఓటమితో చాలా నేర్చుకోవాలి. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఆదరించారు' అని అజర్ చెప్పుకొచ్చాడు.