అనంతపురం జిల్లా కేంద్రంలోని జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. మూడో పట్టణ సిఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం..పాపంపేట ప్రాంతానికి చెందిన వెంకటేష్, పోలేరమ్మ (45) భార్యా భర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆర్తి (17), దీప(11) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్ పూర్తి చేసి, నర్సింగ్లో శిక్షణ పొందుతోంది. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా తల్లి పోలేరమ్మ తన ఆభరాణాలను తాకట్టు పెట్టింది. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. ఈక్రమంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో పోలేరమ్మ భర్తతో గొడవ పడి కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై వారు విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా..రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.