ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నో బాల్స్‌ కోసం కొత్త టెక్నాలజీని వినియోగించనున్న బీసీసీఐ !

national |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2019, 02:52 PM

నో బాల్స్‌ను గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగించాలని బీసీసీఐ ఎప్పటి నుంచో భావిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వెస్టిండిస్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరిస్‌లో నోబాల్స్‌ను గుర్తించడం కోసం కెమెరాలను వినియోగించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఫీల్డ్‌ అంపైర్లు దీనిని ఉపయోగించుకొనేలా ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్‌ జార్జ్‌ మాట్లాడుతూ "నిజమే. ఆ పని జరుగుతోంది. ఐపీఎల్‌ అంటేనే వినూత్నతకు మారుపేరు. ఐపీఎల్‌ ప్రతి సీజన్‌లోనూ ఓ కొత్త సాంకేతకను ప్రవేశపెట్టి ఆట అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నది మా లక్ష్యం" అని అన్నారు. "నోబాల్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం సాంకేతికతకు ఉన్నప్పుడు ఆటగాళ్లు ఎందుకు బాధపడాలి? ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ను సాంకేతికత గుర్తించగలదని నా అభిప్రాయం. ఇప్పటికే దీనిని పరీక్షించాం. వచ్చే నెలలో విండిస్‌తో సిరీస్‌లోనూ దీనిని పరీక్షిస్తాం. ఐపీఎల్‌లో విజయవంతంగా వినియోగించాలని అనుకుంటున్నాం" అని జార్జ్‌ తెలిపారు. విండీస్ సిరీస్ ద్వారా సేకరించిన డేటాను బోర్డు అధికారులు మరియు ఐపీఎల్ పాలక మండలి సభ్యులతో చర్చిస్తారా? అని అడిగిన ప్రశ్నకు "నా సహోద్యోగులతో పాటు, డేటా తర్వాత మొత్తం ప్రక్రియను రెండవసారి పరిశీలించాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఈ ప్రక్రియపై ఆలోచనతో ముందుకు సాగుతాం" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రనౌట్లను తనిఖీ చేసేందుకు మూడో అంపైర్‌ ఉపయోగిస్తున్న కెమెరాలనే నోబాల్స్‌ గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇవి సెకనుకు 300 ఫ్రేములను క్లిక్ చేస్తాయి. ఆపరేటర్ కోరిక ప్రకారం ఈ ఫ్రేమ్‌ను జూమ్ చేయవచ్చు. ఈ నెల మొదట్లో ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఈ ఆలోచన మొదట వచ్చింది. దీనిపై పాలకమండి సభ్యుడు ఒకరు మాట్లాడుతూ "అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే ఐపీఎల్‌లో, నో బంతులను గమనించడానికి రెగ్యులర్ అంపైర్లతో పాటు మరొక అంపైర్‌ను మీరు చూడవచ్చు. ఇది నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది, కాని ఇది ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో చర్చించిన అంశాలలో ఒకటి" అని అన్నారు. ఈ మధ్యకాలంలో ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ గుర్తించడంలో అంపైర్లు పదేపదే విఫలమవుతున్నారు. జట్ల గెలుపోటములపై ఇది ప్రభావం చూపుతుండటంతో ఆటగాళ్లు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా సాంకేతికను వినియోగించాలని బీసీసీఐ భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com