టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. మరి కొద్ది నెలల వ్యవధిలో అన్ని విషయాలు స్పష్టమవుతాయని గంగూలీ పేర్కొన్నాడు. "ధోని భవితవ్యంపై మాకు పూర్తి స్పష్టత ఉంది. కానీ, ఆ విషయాలను బహిరంగ వేదికపై వెల్లడించలేం. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. బోర్డు, ధోనీ, సెలక్టర్లు మధ్య ఎంతో స్పష్టత ఉంది" అని అజంతా షూస్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ చెప్పాడు. "ధోనీ ఛాంపియన్ ఆటగాడు. అలాంటి ఛాంపియన్ ఆటగాళ్లను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. అతడొక అద్భుతమైన ఆటగాడు. అతడి భవిష్యత్తుపై నిర్ణయాలు గోప్యంగానే ఉంటాయి. అవి ఎంతో పారదర్శకంగా ఉంటాయి. ధోని ఎక్కడ నిలబడి ఉన్నారో అందరికీ తెలుసు" అని అన్నాడు. ధోని రిటైర్మెంట్ ఊహాగానాలపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2020 ఐపీఎల్లో ఎలా ఆడతాడనేదానిపైనే ధోని భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. వచ్చే సీజన్ ఐపీఎల్లో ధోని ప్రదర్శన చూసిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్ భారత జట్టులో చోటు దక్కుతుందో లేదో తెలుస్తుందని శాస్త్రి తెలిపాడు. "ధోని క్రికెట్ ఆడడం తిరిగి ఎప్పుడు ఆడతాడు, వచ్చే ఐపీఎల్లో ఎలా ఆడతాడన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరులు వికెట్ కీపింగ్లో ఎలా రాణిస్తున్నారు, ధోనీతో పోలిస్తే వాళ్ల ఫామ్ ఎలా ఉందన్నది కూడా ముఖ్యం. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. ఆ టోర్నీ తర్వాతే 15 మంది(టీ20 వరల్డ్కప్ కోసం)పై ఒక నిర్ణయానికి రావొచ్చు" అని రవిశాస్త్రి అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు. వెస్టిండిస్తో ధోని పూర్తి ఫిట్నెస్తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ పర్యటనకు వెస్టిండిస్ జట్టు రానుంది. ఈ నేపథ్యంలో ధోని వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.