ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2,000 త‌గ్గిన బంగారం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 10:44 PM

బంగారం ధర భారీగా పడిపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర శుక్రవారం 0.7 శాతం తగ్గుదలతో 10 గ్రాములకు రూ.37,997కు క్షీణించింది. దీంతో మూడు రోజుల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో 1 శాతం పతనమై కేజీకి రూ.44,267కు దిగొచ్చింది. బంగారం ధర సెప్టెంబర్ నెలలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్‌పైకి చేరింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ బంగారం ధర దిగొచ్చింది. అమెరికా, చైనా అధికారులు ట్రేడ్ డీల్‌కు సంబంధించి చేస్తున్న ప్రకటనల బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చైనాతో వాణిజ్య ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని అమెరికా వైట్ హౌస్ ఎకనమిక్ అడ్వైజర్ లారీ కుడ్లో వ్యాఖ్యానించడంతో పసిడి పడిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 1467 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. బంగారం ధరకు 1482 డాలర్ల వద్ద బలమైన నిరోధం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. అలాగే బంగారం ధరకు 1455 డాలర్ల స్థాయిలో కీలక మద్దతు స్థాయి ఉందని తెలిపింది. ఇకపోతే బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది ఏకంగా 14 శాతం ర్యాలీ చేసింది. అమెరికా-చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ భౌగోళిక రాజకీయ అస్థిరతులు ధర పెరుగుదలకు దోహదపడ్డాయి. మరోవైపు దేశీ మార్కెట్‌ విషయానికి వస్తే బంగారం ధర ఈ ఏడాది ఏకంగా 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. డిమాండ్ పెరుగుదల, బంగారం దిగుమతులపై సుంకాలు పెంచడం వంటి పలు అంశాలు ధరపై సానుకూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com