స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భం గా జోగి రమేష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకి స్పీకర్ వ్యవస్థపై గౌరవం లేదని మండిపడ్డారు. స్పీకర్ని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ను అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. గత స్పీకర్ ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్నారు. బీసీ స్పీకర్ను దారుణంగా కించపరిచేలా టీడీపీ వెబ్సైట్ ఈ-పేపర్లో ఇష్టానుసారంగా రాశారని ధ్వజమెత్తారు. దీనికి కారకులైన టిడిపి ఎమ్మెల్సీనారా లోకేష్, ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కూన రవిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.