టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు శుభవార్త. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న ధోని మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా గురువారం రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. నెట్స్లో ధోని జార్ఖండ్ బౌలర్లు సంబంధించిన బంతులను ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు. వెస్టిండిస్తో ధోని పూర్తి ఫిట్నెస్తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ పర్యటనకు వెస్టిండిస్ జట్టు రానుంది. ఈ నేపథ్యంలో ధోని వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.