తమిళనాడు రాజకీయం సంక్షోభంలో పడిందని సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘రాష్ట్రంలో సరైన నాయకుడు లేడు. అధికార, ప్రతిపక్షాల వల్ల రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. దీని మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లపై నిప్పులు చెరిగిన ఆయన కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయ అజ్ఞానులు అంటూ మండిపడ్డారు. గతంలో శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి పడుతుందని హెచ్చరించారు.
కమల్ హాసన్, రజనీ కాంత్ అభిమానులు సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సరికాదంటూ తిట్టిపోశారు. అయితే ఈ విషయం మీద విలక్షణ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందన్న రజినీకాంత్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.
రాష్ట్రంలో నాయకత్వం లోపించిందని అన్నారు. గతంలో ఇక్కడ మంచి నాయకులు ఉండేవారని, ఇప్పుడు రాజకీయ సంక్షోభం నెలకొందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకులే కరవయ్యారని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్ గతంలో ఇలానే అంటే ముఖ్యమంత్రి పళనిస్వామి జీర్ణించుకోలేకపోయారని విమర్శించారు. రజనీ మాటల్లో తనకెక్కడా తప్పు కనిపించలేదని కమల్ స్పష్టం చేశారు.