హాస్టల్ ఫీజులు ఒక్కసారిగా భారీగా పెంచడం పట్ల ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు భగ్గుమంటున్నారు. గత కొన్నిరోజులుగా జేఎన్ యూ ప్రాంగణం విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతోంది. ఇటీవలే స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు చేసిన ప్రయత్నం హింసాత్మకంగా మారింది. తాజాగా మరోసారి జేఎన్ యూలో ఉద్రిక్తత నెలకొంది. విశ్వవిద్యాలయం ఆవరణలోని వివేకానందుడి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాదు, 'కాషాయం కాలిబూడిదవుతుంది' అనే అర్థం వచ్చేలా విగ్రహం వద్ద ఎరుపు రంగుతో రాశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న జేఎన్ యూ అధికారులు విచారణ ప్రారంభించారు.