ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ కంటే చంద్రబాబు మహానటుడని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు జ్ఞానం లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు. తమపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తాము కూడా వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. జగన్ ను విమర్శించేందుకు ఎవరు మీకు డబ్బులు ఇస్తున్నారని పవన్ ను ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారంటే ఎక్కడి నుంచో మీకు ప్యాకేజీలు అందుతున్నాయని ఆరోపించారు. మీ గురించి జనసేన కార్యర్తలు, నాయకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. పవన్ కు ఇంకిత జ్ఞానం ఉండదు.. కానీ తమకు మాత్రం ఉండాలంటూ, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జగన్ ను చూసి ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని పవన్ మాట్లాడుతున్నారని.. ఓడిపోతే పరిస్థితి ఏంటని అంటున్నారని… అటైనా, ఇటైనా, ఎటైనా జగన్ వెంటనే ఉండే వ్యక్తులమన్నారు. మీరు అధికారంలో లేకపోయే సరికి మీ వెనుకాల ఉన్న జనం జారి పోతున్నారని తెలిపారు. తమ గురించి మాట్లాడే నైతిక విలువలు చంద్రబాబు, పవన్ కు లేవని చెప్పారు. తెనాలి బాబు, లింగమనేని బాబు కలిసి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లి ప్యాకేజీలు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినవారికి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే నాశనం చేసుకున్నారని పవన్ కల్యాణ్ కు తెలిపారు. సొంతంగా పార్టీని నడుపుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ లు ఇసుక, ఇంగ్లీష్ మీడియంపై తప్ప వేరే మాట్లాడటం లేదన్నారు.