డ్రస్సింగ్ రూమ్ అంటే ఒక దేవాలయం. టీమిండియా డ్రస్సింగ్రూమ్ను చాలా మిస్సవుతున్నా అని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి సచిన్ అరేంగేట్రం చేసి 30 ఏళ్లు అయింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989, నవంబర్ 15న సచిన్ కరాచీ వేదికగా పాకిస్థాన్పై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ని ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులు #30YearsOfSachinism అంటూ శుక్రవారం ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా సచిన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. 'టీమిండియా డ్రస్సింగ్ రూమ్ను చాలా మిస్సవుతున్నా. అప్పటి సహచర ఆటగాళ్ల నవ్వులు, వేడుకలు నేను మిస్సవుతున్నా. డ్రస్సింగ్ రూమ్ అంటే ఒక దేవాలయం' అని సచిన్ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 24 సంవత్సరాల పాటు కొనసాగారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ చేసిన పరుగులు 34357. 'ఐదు తరాల క్రికెటర్లతో ఆడిన ఒకే ఒక్క ఆటగాడిని నేనే అనుకుంటున్నా (నవ్వుతూ). ముందు కపిల్ దేవ్, రవిశాస్త్రి, శ్రీకాంత్, వెంగ్సర్కార్, అజారుద్దీన్తో ఆడాను. తర్వాత గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్తో కలిసి ఆడాను. ఆ తర్వాత యువరాజ్, హర్భజన్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా తరంతో డ్రస్సింగ్ రూం పంచుకున్నా. ఆ తర్వాత సురేశ్ రైనా తరం.. కోహ్లీ, రోహిత్, రహానే తరాన్ని కూడా ప్రత్యక్షంగా చూశా. అన్నింటిని మిస్సవుతున్నా' అని సచిన్ పేర్కొన్నారు. 'అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైరాలు ప్రస్తుతం లేవు. ప్రపంచ క్రికెట్లో నాణ్యమైన పేసర్లు లేకపోవడమే ఇందుకు కారణం. క్రికెట్ ప్రమాణాలు పడిపోవడం టెస్టు క్రికెట్కు మంచిది కాదు. క్రికెట్ ప్రమాణాలు నిర్దిష్టంగా, అత్యున్నతంగా ఉండాలి. పేసర్లు, స్పిన్నర్లకు సహకరించే వికెట్లు తయారుచేసినప్పుడు మాత్రమే బ్యాటు, బంతి మధ్య రసవత్తర పోరు జరుగుతుంది. ఈసారి యాషెస్ పిచ్లు చాలా బాగున్నాయి. పోటాపోటీగా మ్యాచ్లు జరిగాయి' అని సచిన్ అన్నారు.