ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన కారణంగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2018 నుంచి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 పేసర్ల జాబితాలో షమీకి చోటు దక్కింది. ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ జట్టుని 150 పరుగులకే పరిమితం చేయడంలో భారత పేసర్లు సఫలమయ్యారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా... రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. దీంతో 2018 నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో మహమ్మద్ షమీకి మూడో స్థానం లభించింది. టాప్-5 జాబితాలో భారత్ నుంచి ఇద్దరికీ చోటు దక్కింది. ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్(87) వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... సపారీ పేసర్ కగిసో రబాడ(78) వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ(74) వికెట్లతో మూడో స్థానంలో... ఇంగ్లాండ్కు చెందిన స్టువర్ట్ బ్రాడ్(69) వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా(62) వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కాగా, ఈ ఏడాది టీమిండియా ఆడిన టెస్టుల్లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ను తన బౌలింగ్తో కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. విదేశాల్లో షమీ అద్భుత ప్రదర్శన చేయడం విశేషం. కాగా, ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు లంచ్ విరామానికి టీమిండియా 38 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో రహానే(35), మయాంక్ అగర్వాల్(91) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ జట్టు 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (6) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా మరో ఓపెనర్ మయాంక్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. 54 పరుగులు వద్ద పుజారా సైఫ్ హసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో నిరాశ పరిచాడు. జాయేద్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.