ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాన్స్ స్కామ్.. వలవేసింది చిక్కాడు.. ఆపై ఎంతకొట్టేసిందో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 01:01 PM

ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో చాటింగ్‌లు, డేటింగ్‌లు చేసి కొంపకు ఎసరు పెట్టుకుంటున్నారు చాలామంది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చాటింగ్‌లు డేటింగ్‌లతో యువత చెలరేగిపోతోంది. అయితే తద్వారా తమకువచ్చే నష్టాన్ని ఊహించలేకపోతోంది. సోషల్ మీడియా విస్తరించిన తర్వాత ఎక్కువగా నమోదు అవుతున్న కేసులు ఇవే కావడం విశేషం. అపరిచిత వ్యక్తుల వలకు చిక్కడం మాయమాటలు నమ్మడం ఆ తర్వాత కాపురాలు కూల్చుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ ఆన్‌లైన్ చాటింగ్‌కు మరియు డేటింగ్‌కు వయసుతో పనిలేకుండా పోతోంది. కాటికి కాలు చాపుతున్న వృద్ధులు కూడా ఈ వయసులో ఏదో సాధిద్దామని చెప్పి కొంపను కొల్లేరు చేసుకుంటున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.


సోషల్ మీడియా విస్తరించడంతో అన్నీ సోషలైజ్ అయిపోతున్నాయి. 15 ఏళ్ల కుర్రాడి నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు ఈ వలలో చిక్కుకుని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా జరిగిన రొమాన్స్ స్కామ్‌లో ఓ 79 ఏళ్ల వృద్ధుడు రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ విదేశీ మహిళతో ఆన్‌లైన్‌లో చాట్ చేసి ఆ తర్వాత వాట్సాప్‌లో మాటలు కలిపి ఆమె మాయలో పడిపోయాడు. అంతే ఇంకేముందు అతని దగ్గర నుంచి ఎంత పిండుకోవాలో అంతా పిండేసింది ఆ విదేశీ మహిళ.


యురోపియన్ సోషల్ మీడియాలో స్పెయిన్‌కు చెందిన మహిళ ఈ 79 ఏళ్ల వృద్ధుడికి పరిచయం అయ్యింది. తనకు భర్త లేడని ఇద్దరు పిల్లలు ఉన్నారని ఓ కథ అల్లి ఆ వ్యక్తిని బుట్టలో పడేసుకుంది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్ టచ్‌లో ఉంటున్న వీరిద్దరూ సోషల్ మీడియాలోనే ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఇక సోషల్ మీడియా కాకుండా వ్యవహారం వాట్సాప్‌కు మారింది. ప్రతిరోజు పలకరించుకోవడం, ముచ్చటించుకోవడం దాదాపు ప్రేమలో పడ్డారనే అనుకోవాలి. ఇక ఆ మహిళ విసిరన వలలోకి పూర్తిగా ఇరుక్కుపోయిన వ్యక్తి.... ఆమె అవసరాలను తీర్చేందుకు భార్య నగలను కూడా తాకట్టు పెట్టాడు.


అమెరికాలో ఉంటున్న వ్యక్తి కుమారుడు భారత్‌కు వచ్చాడు. తన తల్లి నగలు తండ్రి ఎందుకు తాకట్టు పెట్టాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే నిఘా పెట్టాడు. ఇక సొంతింటిని కూడా అమ్మాలని భావించిన నేపథ్యంలో అసలు సంగతి బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తీగను లాగితే డొంక కదిలింది.


ఇక మహిళ మాయలో మునిగిపోయిన వ్యక్తికి జూన్ నెలలో స్పెయిన్ నుంచి భారత్‌కు ఒక పార్శిల్ పంపిస్తున్నట్లు చెప్పింది. మొబైల్ ఫోన్, నగలు పంపిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇవేమీ తనకొద్దని ఆ వ్యక్తి చెప్పాడు. తనకు వద్దనుకుంటే ఆ కానుకలను అనాథలకు ఇవ్వాల్సిందిగా ఆ విదేశీ మహిళ కోరింది. ఇక మరి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆయనకు మరో మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తను కస్టమ్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. తనకు ఓ పార్శిల్ వచ్చిందని దానిపై విదేశీ కరెన్సీ ముద్ర ఉందని చెప్పి సుంకం కట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. దీంతో ఆ వ్యక్తి రూ.50వేలు చెల్లించాడు.


మళ్లీ కొద్ది రోజులకు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అని చెప్పుకున్న మహిళ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. పార్శిల్‌ అమౌంట్ చాలా ఎక్కువగా ఉందని పంపించిన మహిళ భారత్‌కు రావాలని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. మహిళ దగ్గర విదేశీ కరెన్సీ ఎక్కువగా ఉండటంతో మనీలాండరింగ్ కింద అరెస్టు చేశామని చెప్పారు. ఇలా ఏదేదో చెప్పి డబ్బులు గుంజారు. ఇక డబ్బులు లేకపోవడంతో భార్య నగలను తాకట్టు పెట్టాడు. ఇంటిని అమ్మాలని భావిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తన కొడుకుకు ఈ విషయం తెలిసి భారత్‌కు వచ్చాడు. తన తండ్రి ఫోన్ చెక్ చేయగా వాట్సాప్‌లోని మెసేజ్‌లు చూసి షాక్ అయ్యాడు. ఎవరో మహిళ తన తండ్రిని ట్రాప్ చేసిందని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com