టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి హుందాతనాన్ని చాటుకున్నాడు. గురువారం తొలిరోజు ఆటలో భాగంగా స్టేడియంలో ఉన్న అభిమానులు కోహ్లి-కోహ్లి అంటూ అరుస్తూ చప్పట్లు కొడుతున్న సమయంలో తన కోసం అలా చేయవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. కానీ చప్పట్లు, అరుపులు పేసర్ మహ్మద్ షమీ కోసం కొట్టమంటూ ప్రేక్షకుల్ని తన చేష్టల ద్వారా కోరాడు. ఇలా షమీని ఉత్సాహపరచండి అంటూ కోహ్లి విన్నవించిన మరుక్షణం అభిమానులు అలానే చేశారు. షమీ-షమీ అంటూ హోరెత్తించారు. దాంతో షమీకి ఊపొచ్చినట్లు కనబడింది. అప్పుడు షమీ 54 ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్ ఐదో బంతికి ముష్పికర్ రహీమ్ను ఔట్ చేసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్ డకౌట్గా పెవిలియన్కు చేర్చాడు. మొత్తంగా బంగ్లా తొలి ఇన్నింగ్స్లో షమీ మూడు వికెట్లు సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ను 150 పరుగులకే కట్టడి చేయడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో షమీ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. కాగా, టెస్టుల్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని షమీ చేజార్చుకున్నాడు. 54 ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసిన షమీ.. అటు తర్వాత వేసిన ఓవర్ మొదటి బంతికి వికెట్ తీయడంలో విఫలమై హ్యాట్రిక్ అవకాశాన్ని కోల్పోయాడు. కాకపోతే జట్టు తరఫున ఇషాంత్ శర్మతో కలిసి సంయుక్తంగా హ్యాట్రిక్ నమోదు చేశాడు. 55 ఓవర్ తొలి బంతికే ఇషాంత్ శర్మ వికెట్ తీశాడు. దాంతో జట్టు హ్యాట్రిక్ వికెట్లు సాధించినట్లయ్యింది.