పాతకక్షల నేపథ్యంలో కొందరు దుండగులు దళితుడిని ఎత్తికెళ్లి చితకబాదారు. అంతటితో ఆగకుండా తాగడానికి నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చి ఆ వ్యక్తికి నరకం చూపించారు. ఈ హృదయ విదారకర సంఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాలు.. సంగ్పూర్ జిల్లాకు 55 కి. మీ దూరంలో ఉన్న చంగలివాలా గ్రామానికి చెందిన జగ్మిల్ సింగ్(37) అనే వ్యక్తి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా అతడిని ఎత్తుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ స్తంబానికి కట్టేసి అసభ్యంగా ప్రవర్తించి, రాడ్లతో హింసించారు. అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా వెలుగు చూసింది.
కాగా గ్రామానికి చెందిన రింకూ అనే వ్యక్తితో సెప్టెంబర్21న చిన్న వివాదం ఏర్పడినట్లు, అప్పుడే రాజీకి రావడంతో ఆ గొడవ సర్ధుమనిగిపోయిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ఎత్తుకువెళ్లి స్తంబానికి కట్టేసి కర్రలు, రాడ్లతో కొట్టారని, తాగడానికి నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చారని పోలీసుల ఎదుట వాపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బుధవారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రింకూ, అమర్జిత్ సింగ్,లక్కీ అలీయాస్ గోలి, బీతా అలీయాస్ బిందర్గా గుర్తించారు. వీరంతా చంగలివాలా గ్రామానికే చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితుడి అభియోగంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.