5 స్టార్ హోటల్ అంటే ప్రతీది చాలా లగ్జరీగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. హోటల్లో ఏది తిన్నాలన్నా కూడా చాలా ఖరీదే ఉంటుంది. కాకపోతే కళ్ళు బైర్లు కమ్మే రేట్లు వేస్తే మాత్రం షాక్ కావడం ప్రతి ఒక్కరి వంతు అవుతుంది. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్జియానీకి ఇలాంటి సంఘటనే ఎదురైంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉన్న హయత్ రీజెన్సీ హోటల్లో ఆయన బస చేశారు. గురువారం రోజు ఆయన భోజనంతో పాటు మూడు ఎగ్స్ని ఆర్డర్ చేశారు. ఆ మూడు ఎగ్స్కి హోటల్ వారు ఏకంగా రూ.1672 బిల్లు వేశారు. ఆ బిల్లును చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే దానిని ఫోటో తీసి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. శేఖర్ పోస్ట్ చేసిన బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై హాట్ హాట్ చర్చలు జరుపుతున్నారు నెటిజన్స్. హోటల్ యాజమాన్యాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఉడికించిన మూడు కోడిగుడ్లకు రూ.1350, సర్వీసు చార్జ్గా రూ.67.50, సీజీఎస్టీ 9 శాతంతో రూ.127.58, ఎస్జీఎస్టీ 9 శాతం కింద రూ. 127.58 కలుపుకుని మొత్తం రూ.1672తో ఇచ్చిన బిల్లు చూసి షాకైన రావ్జియానీ.. దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ బిల్లు వైరల్ అయింది. 15 రూపాయల కోడిగుడ్లకు రూ.1600 ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్కు చండీగఢ్లో ఇటువంటి అనుభవమే ఒకటి ఎదురైంది. అక్కడి జేడబ్ల్యూ మారియట్ హోటల్లో రెండు అరటి పండ్లు కొన్నందుకు ఏకంగా రూ.442.50 బిల్లు వేశారు. అతడు కూడా ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ అధికారులు హోటల్కు రూ.25 వేల జరిమానా విధించారు.