ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్ విండో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వచ్చే సీజన్లో కర్ణాటక ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఆడనున్నట్లు తెలుస్తోంది.
ట్రేడింగ్ విండో గురువారంతో పూర్తికానున్న నేపథ్యంలో సాయంత్రానికి ఆటగాళ్ల విషయంలో స్పష్టత రానుంది. అన్ క్యాప్డ్ క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ను ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో కనీస ధర రూ.20 లక్షలుగా ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 6.2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
2018 సీజన్లో రాజస్థాన్ తరుపున 15 మ్యాచ్లు ఆడిన గౌతమ్ గత సీజన్లో కేవలం ఏడు మ్యాచ్లకే పరిమితమయ్యాడు. గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున అతడు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడిని వదులుకునేందుకు సిద్ధమైంది.
దీంతో తన తోటి కర్ణాటక క్రికెటర్లు కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్లతో కృష్ణప్ప గౌతమ్ జతకట్టనున్నాడు. వీరంతా ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రీమయిర్ లీగ్(కేపీఎల్) 2019 సీజన్లో కృష్ణప్ప గౌతమ్ అద్భుతమైన ఫామ్ కనబర్చాడు.
కేపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేయడంతో పాటు ఒక మ్యాచ్లో ఎనిమిది వికెట్లు తీశాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న కృష్ణప్ప గౌతమ్ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించాడు.
39 బంతుల్లో సెంచరీ సాధించిన కృష్ణప్ప గౌతమ్ మొత్తం 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా కేపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును నెలకొల్పాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో శివమొగ్గ లయన్స్ జట్టుపై బళ్లారి టస్కర్స్ జట్టు 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.