వచ్చే ఐపీఎల్ సీజన్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై యాజమాన్యం ట్రేడింగ్ ద్వారా ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్ విండో ఆరంభమైన సంగతి తెలిసిందే. లీగ్లోని మిగతా జట్ల నుంచి ఆటగాళ్లను పొందాలనుకునే ఫ్రాంచైజీలు ట్రేడింగ్ ద్వారా వారిని సొంతం చేసుకోవచ్చు. ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ట్రేడింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 19న కోల్కతాలో ఐపీఎల్ వేలం జరగనుంది.2014లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ట్రెంట్ బౌల్ట్ 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో మొత్తం 33 మ్యాచ్లు ఆడిన ట్రెంట్ బౌల్ట్ 38 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వచ్చే సీజన్లో అంకిత్ రాజ్పుత్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆ జట్టు యాజమాన్యంతో ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. 2018 ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జతకట్టిన అంకిత్ రాజ్పుత్ 23 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. 2018 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అంకిత్ రాజ్పుత్(5/14) చేసిన అత్యుత్తమ ప్రదర్శన ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తే. ఐపీఎల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లలో టీమిండియాకు ఆడని బౌలర్ ఎవరైనా ఉన్నాడంటే అది అంకిత్ రాజ్పుతే. డిసెంబర్ 19న వేలం జరగనుండటంతో ట్రేడింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో మొదటిసారి క్రికెటర్ల వేలం కోల్కతాలో జరుగుతుంది. ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారుతున్న విషయం తెలిసిందే.