ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు టీడీపీ నేత‌ల‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 07:47 PM

ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్థానానికి అవమానం కలిగించేలా విమర్శలు చేసిన ముగ్గురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ల‌కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాల్లాది విష్ణుతో కలిసి ఆయన మాట్లాడారు. మీదీ ఒక బతుకేనా...?, శాసనసభలో ఆంబోతు, దున్నపోతులా నిద్రిస్తున్నావ్... వాడు, వీడు అంటూ అసభ్య పదజాలంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రతిపక్ష నాయకులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ దూషించారన్నారు.
ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా లేఖల రూపంలో స్పీకర్ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. స్పీకర్ గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు, లోకేష్, కూన రవికుమార్‌కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
సంక్షేమ పథకాల అమలులో ఏపీ రోల్ మోడల్ ప్రతి బుధవారం నిర్వహించే ప్రభుత్వ, పార్టీ సమన్వయ సమావేశం అసెంబ్లీలోని వైసీపీపీ కార్యాలయంలో నిర్వహించామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా 25 వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం, సెర్ప్ కార్యక్రమాల అమలుపై చర్చించామన్నారు.
సంక్షేమ పథకాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అస్తవ్యస్తంగా అమలు చేశారన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించారన్నారు.
ఇటువంటి అవకతవకులకు అడ్డుకట్ట వేస్తూ, ఉపాధి హామీ పథకానికి చెందిన ప్రతి రూపాయి కూడా పేదలకు అందజేయాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. మహిళా సంఘాలను రాజకీయ సభలకు వినియోగించకుండా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ప్రతి బుధవారం నిర్వహించే ప్రభుత్వ-పార్టీ సమన్వయ సమావేశంలో అన్ని శాఖలపైనా ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇసుక కొరత నివారణకు గురువారం నుంచి ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు ఎంతో మేలు కలుగు చేస్తోందన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి వంటి నేత దేశంలోనే లేరన్నారు. తమ నాయకుడికి వస్తున్న ప్రజామోదాన్ని చూడలేక...విపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ కోసమే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆమోదయోగ్యమైన సలహాలను ప్రతిపక్షం ఇస్తే స్వీకరిస్తామని, పబ్లిసిటీ స్టంట్ కోసం అర్థరహితమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్ట చేశారు.
చంద్రబాబుకు కావాల్సినంత ఇసుక ఇస్తాం: ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు


సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వానికి వస్తున్న ప్రజామద్దతను చూడలేక, అసూయ, ఈర్ష్య, దుగ్ధతోనే విపక్ష నేత చంద్రబాబునాయుడు కొంగ జపం, దొంగ దీక్షకు దిగుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఇసుక మాఫియాను పెంచి పోషించింది విపక్షమేనన్నారు.
ఇసుక కొరత మానవ తప్పిదమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అక్రమంగా తరలించేవారిని, అధిక ధరలకు విక్రయించేవారిని ఏనాడయినా జైలుకు పంపిస్తామని చట్టం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షంగా విఫలమై... చంద్రబాబునాయుడు రోడ్డెక్కుతున్నారన్నారు. రాజకీయాల్లో లంబు, జంబుగా టీడీపీ, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లక్షా 25 వేల టన్నుల ఇసుక ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉందన్నారు. 2 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారని, ఇందుకోసమే గురువారం నుంచి ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, కావాల్సినంత ఇసుక సరఫరా చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆఫర్ ఇచ్చారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com