ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 04:03 PM

బుధవారం జరిగిన ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ,ఇంగ్లీష్ మీడియం బోధనపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇకపై ఇసుక


అక్రమ రవాణాకు పాల్పడితే రూ.2లక్షలు జరిమానా,రెండేళ్లు కనీసం జైలు శిక్ష తప్పదన్నారు. ఇసుకను నిల్వ చేసే అధికారం మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. గత 4 నెలలుగా ఇసుక కొరత ఉన్నందునా.. ఆ స్థితిని సాధారణీకరించేందుకు ఒక వారం పాటు రెవెన్యూ,పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటామని చెప్పారు.


ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.చాలామంది పెద్దలు కంగారుపడుతున్నట్టుగా తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశం లేదని చెప్పారు. మాతృభాష ఏదైతే అది ఒక సబ్జెక్టుగా చదవాల్సిందేనన్నారు. ఇప్పటికే 34శాతం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోందన్నారు. కొత్తగా ప్రభుత్వం మిగతా 66శాతం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం బోధన అనేది ఒక కార్యక్రమం కాదని,ఒక సంస్కరణ అని స్పష్టం చేశారు.


గ్రామ స్థాయిలో వివాదాల సత్వర పరిష్కారం కోసం కొత్తగా గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 84చోట్ల వీటి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏడాదికి రూ.20కోట్లు పైబడి ఆదాయం వచ్చే 9 దేవాలయాల ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.


రాష్ట్రంలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని కేబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు. కనీస మద్దతు ధర రూ.1750గా నిర్ణయించినట్టు తెలిపారు. విజయనగరం, కర్నూలులో నేడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్టు చెప్పారు. అలాగే అగస్టు 31,2019 వరకు ఎవరైనా అనాథ రైతులు తమ ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వాటిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందన్నారు. ఆ ఇంటి లేఔట్‌లో కనీసం 30ఫీట్ల రోడ్ ఉండాలన్న నిబంధన పెట్టామని చెప్పారు. ఇక సోలార్ పవర్ పాలసీ 2018,విండ్ పవర్ పాలసీ 2018లో మార్పు చేస్తామన్నారు. డిస్కంలు,ట్రాన్స్‌కమ్‌లు ఆర్థికంగా కుదేలవకుండా కాపాడేందుకు కొన్ని సవరణలు చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com