తన కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకడని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో భారత్లో 2001లో జరిగిన ఫేమస్ టెస్ట్ సిరీస్ను ఈ సందర్భంగా గిల్క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. ఈ సిరిస్లో భాగంగా ముంబైలో జరిగిన టెస్టులో గిల్ క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం టెస్టుల్లో ఆస్ట్రేలియాకు వరుసగా 16వది కావడం విశేషం. గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ "99/5 స్థితిలో ఉన్న సమయంలో క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో సెంచరీ చేశాను. మూడు రోజుల్లోనే మ్యాచ్ గెలిచాం" అని అన్నాడు. "30 సంవత్సరాలుగా భారత్లో సిరిస్ గెలవలేదు. గతంలో ఆడిన వారంతా ఎందుకు సాధించలేకపోయారు. ఇక్కడ టెస్టు గెలవడం ఇంత సులభమా? కానీ, ఆ తర్వాత నాకు తెలిసింది నేను తప్పుని. ఆ తర్వాతి టెస్టు మ్యాచ్ కోసం మేము కోల్కతాకు వెళ్లాం. అక్కడ నాకు రియాలిటీ గురించి తెలిసింది" అని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆడిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోవడంతో సిరిస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. "ఆ సిరిస్ ముగిసే సమయానికి 'దాడి, దాడి, దాడి' కాకుండా స్థిరంగా ఆడేందుకు గాను హ్యాండ్బ్రేక్ ఎలా వేయాలో తెలుసుకున్నాను. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ పనిచేయదు - హర్భజన్ మమ్మల్ని పూల్స్ని చేశాడు. నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్... వీళ్లిద్దరూ నేను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లు" అని పేర్కొన్నాడు. 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో హర్భజన్ సింగ్ మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. 2001 టెస్టు సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్ విషయంలో ఆస్ట్రేలియా విధానం, వ్యూహాలలో చాలా మార్పులను తీసుకువచ్చిందని గిల్ క్రిస్ట్ తెలిపాడు. "2001లో మేము ఏమి నేర్చుకున్నామంటే... మా వ్యూహాలను మార్చాం. ప్రతి పరిస్థితి నుంచి బయటపడేందుకు దాడి చేయడం అనేది మార్గం కాదని తెలుసుకున్నాం" అని గిల్ క్రిస్ట్ అన్నాడు.