బెంగళూరు : కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై జేడీఎస్ నాయకులు కుమారస్వామి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు తీవ్ర అసంతృప్తిని ఇచ్చిందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగొద్దని కుమార స్వామి చెప్పారు. అయితే కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ 17 మంది ఎమ్మెల్యేలు సహకరించారు. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ రెబల్స్ అంతా 2023 వరకు సభాకాలం ముగిసే దాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టివేసింది. మళ్లీ పోటీ చేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని కోర్టు తెలిపింది. అనర్హత వేటు పడిన వారిలో కాంగ్రెస్ నుంచి 14 మంది, జేడీఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 17 స్థానాల్లో 15 చోట్ల డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈనెల 18. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.