సుప్రీంకోర్టు ఈరోజు మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచారహక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. దీంతో గతంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా తుదితీర్పును వెలువరించింది.