ముంబయి : మహారాష్ట్రకు శివసేన పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి ఆయన ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. ఛాతీ నొప్పితో సోమవారం రాత్రి సంజయ్ రౌత్ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. అయితే ఆస్పత్రిలోనే సంజయ్ను పలువురు నాయకులు కలిసి పరామర్శించారు. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే సంజయ్ను ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీడియా పలుకరించగా.. శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని పునరుద్ఘాటించారు. డిశ్చార్జి కంటే ముందు సంజయ్తో కాంగ్రెస్ నాయకులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.