టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఉచిత ఇసుక పాలసీని అమలు చేసేవరకు ఇసుక మీద పోరాటం చేస్తామని అన్నారు. బుధవారం ఇక్కడ బోండా ఉమ నివాసంలో టీడీపీ నేతల బృందం సమావేశమైంది. కృత్రిమ ఇసుక కొరత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉమ.. ఇసుక కొరత కారణంగా చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద నెలకు రూ.10వేలు చెల్లించాలన్నారు. ఇసుక మాఫియా పేరుతో టీడీపీ విడుదల చేసిన చార్జ్ షీట్లోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇసుక కొరత ఏర్పడిందని, వైసీపీ ప్రభుత్వం చెత్త విధానాలవల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.