మన ప్రజాసామ్యంలో రైతులకు, కూలీలకు మంచి గౌరవం దక్కాలనే నేపథ్యంలో ఎందరో మహానుభావులు ఆ దిశగా కృషి చేశారు. అలాంటి వారి కృషికి తాజాగా బెంగుళూరులో జరిగిన ఓ సంఘటన సరైన గౌరవాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పాలి. కూలి పని చేసుకుని జీవనాన్ని సాగించే ఓ కూలి బెంగుళూరులో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఆహ్వానం పొందారు. అంతేకాదు, కూలీ కూతురు చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అక్కడి అధికారులు అందరి ప్రశంసలు, మన్ననలను పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని రైల్వేస్టేషన్లో ఇటీవల ఎస్కలేటర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆ ఎస్కలేటర్ ను ప్రారంభించి దాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీన ఎంపీ పీసీ మోహన్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజు అయోధ్య తీర్పు రావడంతో ఆయన ఆ కార్యక్రమానికి రాలేకపోయారు. అయితే తాను రాలేకపోయినా కూడా ప్రారంభోత్సవం ఆపవద్దని అధికారులకు సూచించారు. సామాన్యులకు ఉపయోగపడే నిర్మాణం కాబట్టి జాప్యం చేయకూడదని పేర్కొన్నారు. ఎంపీ చెప్పిన మాటలతో వెంటనే అధికారులు సెలెబ్రెటీలతో కాకుండా సామాన్యుల చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణంలో భాగం పంచుకున్న చాంద్బీ అనే మహిళ కూతురు బేగమ్మా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. దాని కోసం కష్టపడి పనిచేసిన వారికి ఈ విధంగా గుర్తింపు ఇచ్చినట్టుగా ఉండటంతో పాటు ప్రజలకు ఎస్క్లేటర్ అందుబాటులోకి వస్తుందని ఇలా చేశామని అధికారులు పేర్కొన్నారు.