ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక పౌర్ణమి: శివరాత్రితో సమానమైన రోజు!

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 08:18 PM

అన్ని మాసాలలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనం. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. ‘చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం’. ఇందులో కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా భావించ బడుతుంది. దీనిని ‘త్రిపుర పూర్ణిమ, రాస పూర్ణిమ, దేవ దీపావళి’ అని కూడా అంటారు. ఈ రోజును మనువులలో పద్నాలుగోవాడైన భౌత్యుని పేరున భౌత్యమన్వంతరాది, ఇంద్ర సావర్ణిక మన్వంతరమని కూడా అంటారు. త్రిపురాసుర సంహారం జరిగింది కూడా ఈ రోజే. శంకరుని కీర్తిని నారదుని వల్ల విన్న త్రిపురాసురుడు ద్వేషం పెంచుకుని పెంచుకుని కైలాసంపైకి దండెత్తి వెళ్లాడు. పరమేశ్వరునితో కయ్యానికి కాలుదువ్విన త్రిపురాసురుడు మూడు రోజుల భీకర యుద్ధం తర్వాత సంహరింపబడ్డాడు. దేవతలు అభయంకరుడైన శంకరుడిని స్తోత్రం చేశారు. వెయ్యేళ్ల అసుర పాలన అంతమైన శుభ సందర్భాన శివుడు తాండవం చేశాడని పురాణ కథనం కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం, నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొప్పలో ఉంచి నదిలో లేదా కొలనులో విడిచిపెడతారు. మరి కొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలుకాని వారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఇళ్ళల్లో తులసి కోట వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధనతో ముక్కోటి దేవతల పూజాఫలం, సకల పుణ్య నదుల స్నాన ఫలం దక్కి ఇహ పరలోకంలో సుఖ సౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పురాణవచనం. ఈ రోజున కేదాశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా పెట్టి, పూజలు చేయడం ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. జైనులకు, పంజాబీలకు ఇది విశిష్టదినం. గంగా మహోత్సవం కూడా ఈ రోజునే నిర్వహిస్తారు. తెలుగువారు కార్తీక పూర్ణిమ వ్రతంలో చలిమిడి చేస్తారు. తమిళులు వేపుడు బియ్యం, అటుకులు చేస్తారు. బలి చక్రవర్తికి ఒళ్లంతా మంటలు పుడితే కార్తీక పౌర్ణమి నాడు శివారాధన చేయడంతో మంటలు తగ్గినట్లు, మహిషాసురుడితో యుద్ధం చేసిన సమయాన శివలింగాన్ని బద్దలు కొట్టిన పాపనివృత్తికై పార్వతీదేవి కూడా శివారాధన చేసినట్లు పురాణ కథనాలు. నాలుగు నెలలు పాటు బుద్ధుడు ఉత్తమ లోకంలో తల్లి వద్ద ఉండి తిరిగి భూలోకానికి కార్తీక పౌర్ణమి రోజున దిగి వచ్చే క్రమంలో బౌద్ధులు దీపమాలికలు వెలిగించి, మత స్థాపకునికి స్వాగతోపచారాలు చేస్తారు. బర్మాలో ప్రతి చోటు దీపాలతో నిండి ఉంటుంది. ‘నందన సంవత్సరమున, పొందుగ కార్తీక శుద్ధ పున్నమ నాడున్, వింధ్యాద్రి సేతుబంధన, సందున నొక వీరుడేలు సరుగన వేమా’ అని క్రీ.శ.1532లో దిగా పరిశోధకులు నిర్ణయించిన వేమన పద్యంలో కార్తీక పున్నమి ప్రస్తావన ఉంది. కార్తీక శుద్ధ పూర్ణిమ రోజున కృత్తికా దీపోత్సవాన్ని ఆచరించడం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి, కార్తీక దామోదరుని పూజ, దీపారాధన చేయటం అత్యంత పుణ్యప్రదం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com