ఏపీ టీడీపీలో కొందరు నేతలు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు కూడా ఇప్పుడు పార్టీ తరపున పోరాటం చేసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ.. టీడీపీలో పూర్తిగా సైడైపోయిన పరిస్థితి. వీరిలో నారాయణ ఎన్నికల్లో ఓడిపోగా... గంటా మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించే విషయంలో మాత్రం ఇద్దరూ ఓకే రకంగా వ్యవహరిస్తున్నారు.
స్వతహాగా వియ్యంకులైన ఈ ఇద్దరు నాయకులు పార్టీలో ఏ రకమైన రాజకీయం చేస్తున్నారో... ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందని విశాఖ జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాలు సైతం గంటా తమ పార్టీలో ఉంటారో లేదో తెలియదని చర్చించుకుంటున్నాయి.
గంటా సంగతి ఇలా ఉంటే... మరో మంత్రి నారాయణ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితమైన నారాయణ... మొన్నీమధ్య టీడీపీ నాయకుల అమరావతి పర్యటనలో తళుక్కుమన్నారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారనే వార్తలు మొదలయ్యాయి. అయితే టీడీపీలో ఈ వియ్యంకుల రాజకీయం ఏమిటో తమ పార్టీ అధినేత చంద్రబాబుకే తెలియాలని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీలో వియ్యంకుల రాజకీయం ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.