ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లెక్సీ పోల్ పడి మరో యువతి మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 04:36 PM

తమిళనాడులో కొన్ని నెలల క్రితం రోడ్డుపై వెళ్తున్న శుభశ్రీ అనే యువతిపై ఫ్లెక్సీ పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమైంది. దీనిపై మద్రాస్ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. దానిపై చర్చ ఇంకా జరుగుతుండగానే కోయంబత్తూరులో అదే తరహాలో మరో ఘటన జరిగింది. అనురాధ అనే మహిళ స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా ఫ్లెక్సీ పోల్ పడింది. దాన్ని తప్పించే క్రమంలో ఆమె కింద పడగా వెనుక నుంచి వచ్చి లారీ ఆమె కాళ్లపై నుంచి వెళ్లిపోయింది.


కోయంబత్తూరుకు చెందిన అనురాధ ఓ ప్రముఖ సంస్థలో బిజినెస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తోంది. సోమవారం ఆమె ఆఫీసుకు స్కూటీపై బయలుదేరింది. హైవేపై వెళ్తుండగా ఓ చోట ఏర్పాటుచేసిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఫ్లెక్సీ పోల్ ఆమె ముందు పడింది. దాన్ని తప్పించే క్రమంలో అనురాధ కింద పడిపోయింది. దీంతో ఆమె వెనుకే వస్తున్న లారీ వేగంగా ఆమె కాళ్లపై నుంచి వెళ్లిపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంతో వాహనదారులంగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో అనురాధ రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ ఘటనతో తమిళనాడులో మరోసారి ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. ప్రజాసంఘాలు, ప్రజలు అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు అవినాశి హైవేపై పెట్టిన జెండా స్తంభం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఒక్కగానొక్క కూతురు చావుబతుకులతో పోరాడుతుండటాన్ని అనురాధ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగం చేస్తూ తమ కుటుంబానికి ఆసరాగా ఉన్న అనురాధ ఇప్పుడు ఆస్పత్రిలో ఉందని, ఇకపై తమకెవరు దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుభశ్రీ కేసులో నిందితుడిగా ఉన్న అన్నాడీఎంకే నేత జయగోపాల్‌ సోమవారమే బెయిల్‌పై బయటకు రావడం, అదేరోజు మరో ఘటన జరగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com