ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జానీ బెయిర్ స్టోను సోమవారం ఐసీసీ తీవ్రంగా మందలించింది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్కులో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో పరుష పదాలను ఉపయోగించినందుకు ఐసీసీ అతడిపై ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ మ్యాచ్లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జానీ బెయిర్ స్టో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు. అయితే, ఐసీసీ ప్రవర్తనా నియమావళిని లెవల్ 1 ఉల్లంఘించినందుకు గాను అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేర్చబడింది. ఐదో టీ20లో దూకుడుగా ఆడుతున్న జానీ బెయిర్ స్టోను ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో జేమ్స్ నీషమ్ పెవిలియన్కు చేర్చాడు. పెవిలియన్కు చేరే క్రమంలో అతడి క్యాచ్ పట్టిన న్యూజిలాండ్ ఫీల్డర్ టిమ్ సీఫర్ట్ని బూతులు తిట్టాడు. వాటిని స్టంప్ మైక్తో పాటు టీవీలో విన్న ఆన్ఫీల్డ్ అంపైర్లు వెయ్న్ నైట్స్, క్రిస్గఫానీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు మ్యాచ్ అనంతరం బెయిర్స్టో తన తప్పుని ఒప్పుకోవడంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేర్చారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్స్ సపోర్ట్ పర్సనల్ ఆర్టికల్ 2.3 ప్రకారం ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్లో పరుష పదాలు ఉపయోగించరాదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే ఐసీసీ మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత ఉంటుంది. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లను ఐసీసీ శిక్షగా విధిస్తారు. ఇదిలా ఉంటే, వరుణుడు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 146 పరుగులు చేసింది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై' అయింది. మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో బెయిర్స్టో, మోర్గాన్ 17 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ కేవలం 8 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్ను ఇంగ్లాండ్ 3-2తో కైవసం చేసుకుంది.