మూడు టీ20ల సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. పెర్త్ వేదికగా పాకిస్థాన్తో శుక్రవారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. దీంతో సొంతగడ్డపై మూడు టీ20ల సిరిస్ను ఆస్ట్రేలియా క్లీన్స్వీప్ చేసినట్లైంది.ఈ సిరిస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. కాన్ బెర్రా వేదికగా జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా మూడో టీ20లో కూడా విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. మూడో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మ్యాచ్ ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఓపెనర్ బాబర్ ఆజాం(6)ను ఎల్బీగా స్టార్క్ పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ను తాను ఎదుర్కొన్న తొలి బంతికే మిచెల్ స్టార్క్ పెవిలియన్కు చేర్చడం విశేషం. అయితే, ఓ అద్భుతమైన ఇన్ స్వింగర్కు రిజ్వాన్ను స్టార్క్ డకౌట్గా ఔట్ చేశాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఇఫ్తికర్ (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇమామ్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరుని అందుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ మూడు వికెట్లు తీయగా... స్టార్క్, అబ్బాట్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆష్టన్ అగర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (52 నాటౌట్), వార్నర్ (48 నాటౌట్)లు చేలరేగారు. పాకిస్థాన్ బౌలర్లు మైదానం నలుమూలలా చిత్తుగా బాదారు. ఈ క్రమంలో మరో 49 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించడం విశేషం. ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన స్టీవ్ స్మిత్కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు లభించింది.