గురువారం రాత్రి బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (85; 43 బంతుల్లో 6x4, 6x6), శిఖర్ ధావన్ (31; 27 బంతుల్లో 4X6) ధాటిగా ఆడడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. పరుగుల వరద పారించిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. చివరి మ్యాచ్ ఆదివారం నాగ్పూర్లో జరుగుతుంది. మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా మాట్లాడుతూ... 'బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్. 180 పరుగులు కూడా ఇక్కడ సాధించొచ్చు. కానీ.. మేము 25-30 పరుగులు తక్కువ చేసాం. మ్యాచ్ క్రెడిట్ అంతా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్కు దక్కుతుంది. ముఖ్యంగా రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభం నుండే మాపై దాడి చేసి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఇలాంటి వికెట్పై రిస్ట్ స్పిన్నర్ ప్రభావం చూపిస్తారు. చహల్ బాగా రాణించాడు' అని అన్నాడు. 'మా జట్టులో అమీనుల్ మంచి బౌలింగ్ చేసాడు. అతడు వేసిన కొన్ని బంతులు చూస్తే.. ఆశ్చర్యం కలిగింది. అమీనుల్ ఇదే ఆటను కొనసాగిస్తాడనుకుంటున్నా. నాగ్పూర్ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంది. మంచి వికెట్ లభిస్తే.. సరైన ప్లాన్ చేసి సాధ్యమైనంత ఎక్కువ స్కోరు చేయడానికి ప్రయత్నిస్తాం. రెండో టీ20లో కొన్ని తప్పులు చేసాం. అవన్ని జట్టుగా చర్చించి సరిదిద్దుకుంటాం. సిరీస్ గెలవడానికి మేం అన్ని విధాలా ప్రయత్నిస్తాం. అయితే భారత్ అత్యుత్తమ జట్టు. గెలవాలంటే అద్భుతంగా పోరాడాలి' అని మహ్మదుల్లా పేర్కొన్నాడు. టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'స్పిన్నర్లు పిచ్ను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకున్నాం. వికెట్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కష్టంగా మారిపోతుందని తెలుసు. దానిని సద్వినియోగం చేసుకుని పవర్ప్లేలో రెచ్చిపోయాం. నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఒకే ఒక పని.. బ్యాట్ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో బంతిని బలంగా బాదాలని నిర్ణయించుకున్నా. 2019 అద్భుతంగా సాగింది. దీనిని అలాగే ముగించాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు