ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20ల్లో ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు 241/3....

international |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 01:52 PM

తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచిన నెలల తర్వాత కూడా ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆకట్టుకుంటూనే ఉంది. నేపియర్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. డేవిడ్ మలన్(103 నాటౌట్, 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(91, 41 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు)తో రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టీ20ల్లో ఇంగ్లాండ్ అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డుని మలన్-మోర్గాన్ జోడీ బద్దలు కొట్టింది. 2012లో నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రవి బొపారా-అలెక్స్ హేల్స్‌లు నెలకొల్పిన 159 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడి అధిగమించింది. కివీస్ బౌలర్లను చీల్చి చెండాడిన డేవిడ్ మలన్ తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. మలన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు స్కోరు 16 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో(8) తొలి వికెట్‌గా కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్‌తో కలిసి ఓపెనర్ టామ్ బాంటన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, జట్టు స్కోరు 58 పరుగుల వద్ద బాంటన్(31) మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి మలన్ కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. మరోవైపు మోర్గాన్ సైతం బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో సెంచరీ ముంగిట టిమ్ సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో తృటిలో ఇయాన్ మోర్గాన్ సెంచరీని కోల్పోయాడు. ఇయాన్ మోర్గాన్ స్ట్రయిక్ రేట్ 221.95గా నమోదవడం విశేషం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com