దక్షిణాఫ్రికా ఇప్పటికీ ఫాఫ్ డుప్లెసిస్ జట్టే. నేను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే అని ఇటీవలే దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు కెప్టెన్ అయిన క్వింటన్ డికాక్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా కెప్టెన్గా డుప్లెసిస్ ఉంటాడని నేను అనుకుంటున్నా. అయితే పూర్తి స్థాయిలో కెప్టెన్గా అవకాశం వస్తే రెండు చేతులతో అందిపుచ్చుకుని నిరూపించుకుంటా అని డికాక్ తెలిపాడు. డికాక్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇటీవల భారతదేశంలో పర్యటించి 1-1తో డ్రాగా ముగించింది. తాజాగా డికాక్ మీడియాతో మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికా ఇప్పటికీ డుప్లెసిస్ జట్టే (బేబీ). నేను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే అని అనుకుంటున్నా. అయితే పరిస్థితులు మారి కెప్టెన్గా అవకాశం వస్తే రెండు చేతులతో అందిపుచ్చుకుని నిరూపించుకుంటా. ప్రస్తుతానికి కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. టీ20 జట్టులోని కొత్త కుర్రాళ్లకు అండగా ఉంటూ సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం సమాయత్తమవుతున్నా' అని అన్నాడు. 'కీలక ఆటగాళ్ల నిష్క్రణతో మేము ఇప్పుడే మంచి జట్టును వెతుకుతున్నాం. అయితే పరివర్తన సాధించిన మొదటి జట్టు మాదేమీ కాదు. ఇంగ్లాండ్ ప్రపంచకప్-2015 తర్వాత పరివర్తన సాధించింది. నాలుగు సంవత్సరాల తరువాత కప్ గెలిచారు. అలాగే ప్రొటీస్ రగ్బీ జట్టు ప్రపంచకప్ గెలిచి మాకు ఆదర్శంగా నిలిచింది. ఇంగ్లాండ్ మాదిరిగానే వచ్చే ప్రపంచకప్ సమయానికి మంచి జట్టును సిద్ధం చేసుకుంటాం' అని డికాక్ ధీమా వ్యక్తం చేసాడు. టీమిండియాతో టీ20 సిరీస్ను సమం చేసుకున్న సఫారీలు.. మూడు టెస్టుల సిరీస్లో మాత్రం తేలిపోయారు. వరుస రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూశారు. భారత్ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ల్లో విశేషంగా రాణించడంతో సఫారీలు భారంగా సిరీస్ ముగించారు. సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంతో భారత్ ఖాతాలో 240 టెస్టు చాంపియన్షిప్ పాయింట్లు చేరాయి. ఇప్పుడు భారత జట్టే పాయింట్ల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఖాతా తెరవలేదు.